05-05-2025 02:35:12 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మే 4 (విజయ క్రాంతి): సహనానికి.. ఓర్పునకు మహిళలు మారుపేరని, క్రమశిక్షణ, పట్టుదల, కృషి, కటోర శ్రమతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ఆదివారం డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్ లో ఉన్న వీ కన్వెన్షన్ హాల్ లో గ్రామీణ మహిళ నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ప్రముఖ నటి, డెమోక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసాండ్రా, సంస్థ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త ఎంఆర్ఎస్కే చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ముందుండాలని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న మహిళలు సమస్యలపై చక్కగా మాట్లాడాలని, వారు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువలను, మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి లాభాపేక్షలేకుండా డెమోక్రటిక్ సంఘ సంస్థ కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డెమోక్రటిక్ సంఘ ట్రస్ట్ ప్రియ రాజీవ్, ప్రతినిధి షేక్ ఆయుబ్, అడిషనల్ డి ఆర్ డిఓ సునీత, మహిళలు పాల్గొన్నారు.