05-05-2025 12:00:00 AM
మునుగోడు,మే 4 (విజయక్రాంతి) : ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం అని ఇరిగేషన్ అధికారులు మునుగోడుకు అత్యధిక నిధులు కేటాయించి ఫ్లోరైడ్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నియోజకవర్గాల వారిగా సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
గత పదేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా లో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా డిండి ఎత్తిపోతల పథకంలో మునుగోడు,దేవరకొండ నియోజకవర్గం లోని మూడున్నర లక్షల ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులకు గత ప్రభుత్వాలు ఎక్కడినుండి నీటి తీసుకురావాలనేది నిర్ణయించ లేదు అని అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తీసుకునే విధంగా నిధులు మంజూరు చేసి టెండర్లను పిలిచి పనులను మొదలు అయ్యాయని, నియోజకవర్గంలోని నారాయణపూర్ చౌటుప్పల్ మండలాలకు నీటి లభ్యత వనరులు లేవు,నారాయణపూర్ చౌటుప్పల్ మండలాలకు శివన్నగూడెం రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించాలని అన్నారు.
బ్రాహ్మణవెళ్ళేంల ప్రాజెక్టు ద్వారా మునుగోడు మండలంలోని కిస్టాపురం వరకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విస్తరించి మునుగోడు మండలంలోని అన్ని చెరువులను నింపే విధంగా నీటిని అందించాలని,మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 501 ట్యాంకులు ఉన్నాయి, ఆ గొలుసుగట్టు చెరువులకు ఫీడర్ చానల్స్ సరిగా లేవు, చెరువుల్లో పూడిక నిండిపోయింది.
111 రోడ్లు కేటాయించి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చెరువులను పునరుద్ధరించాలి.ఈ ప్రాంతం పై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎక్కువ నిధులు కేటాయించి న్యాయం చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని విన్నవించారు.