calender_icon.png 26 June, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లా సెట్ ఫలితాలు విడుదల

26-06-2025 12:50:29 AM

- 66.46శాతం ఉత్తీర్ణత నమోదు

- మూడేళ్ల లా కోర్సులో ఏపీ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మన్ ప్రొ.పురుషోత్తం, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎం.కుమార్‌తోపాటు ఇతర అధికారులు కలిసి ఫలితాలను విడుదల చేశారు. మూడు కోర్సుల్లో కలిపి ఈసారి 66.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇందులో మహిళలు 62.49 శాతం, పురుషులు 68.38 శాతం అర్హత సాధించారు. లా సెట్ పరీక్షలను జూన్ 6న రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహించిన విషయం విదితమే. 57,715 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 45,609 మంది పరీక్షకు హాజరైతే, 30,311 మంది ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల లా కోర్సులో 67.61 శాతం, ఐదేళ్ల కోర్సులో 51.83 శాతం, రెండేళ్ల పీజీ కోర్సులో 90.33 శాతం అర్హత సాధించారు.

మూడేళ్ల లా కోర్సులో మొదటి ర్యాంకు ఏపీ కోనసీమ జిల్లాకు చెందిన కే హర్షవర్ధన్‌రాజు సాధించగా, రెండో ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ బొడ్డు, మూడో ర్యాంకు సిద్దిపేటకు చెందిన ఎం.శిరీష్‌శర్మ సాధించారు.ఐదేళ్ల లాకోర్సులో ఫస్ట్ ర్యాంకును ఆదిలాబాద్‌కు చెందిన ఇ.రుత్విక, రెండో ర్యాంకు సంగారెడ్డికి చెందిన బల్ల గోపేశ్‌రామ్‌సాయి, మూడో ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన జోహనాజ్ సాధించగా, తొమ్మిదో ర్యాంకును మాత్రం బిహార్‌కు చెందిన రైహాన్ బైగ్ అభ్యర్థి సాధించారు. రెండేళ్ల పీజీఎల్‌సెట్‌లో మొదటి ర్యాంకును రంగారెడ్డికి చెందిన లుక్క హిమజ, రెండో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ బొడ్డు, మూడో ర్యాంకును జనగామకు చెందిన మహ్మద్ అసదుల్లా షరీఫ్ సాధించారు. 

అభ్యర్థుల్లో 60 ఏండ్లు పైబడిన వారు

ఈ ప్రవేశ పరీక్షలు రాసిన వారిలో 333 మంది 60 ఏళ్లు పైబడినవారు ఉండడం గమనార్హం. మూడేళ్ల లా ప్రవేశ పరీక్ష రాసిన వారిలో బీకామ్ అభ్యర్థుల తర్వాత బీటెక్ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. బీకామ్ అర్హత ఉన్న అభ్యర్థులు 12,656 మంది దరఖాస్తు చేసుకోగా, బీఈ/బీటెక్ చేసిన వారు 9,188 మంది, ఎంబీబీఎస్ చేసిన వారు 127 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదిలో మొత్తం 9,388 సీట్లు అందుబాటులో ఉంటే, కన్వీనర్ కోటా సీట్లు 8,680 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 708 సీట్లు ఉన్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈసారి శాతవాహన, పాలమూరు వర్సిటీల పరిధిలోని లా కాలేజీల్లోనూ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.