calender_icon.png 19 June, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తాం..

19-06-2025 07:28:33 PM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. గురువారం ఉదయం మునుగోడు మండలం పలివెల గ్రామంలో కలియ తిరుగుతూ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు చేపట్టాల్సిన ప్రాంతాలను, ఇళ్లపై నుండి వెళ్తున్న విద్యుత్ తీగలను పరిశీలించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించే బాధ్యత నాదని, మొదటి విడతగా కొందరికి వచ్చాయి రెండో విడతలో ఇంకొందరికి ఇస్తామని పార్టీలకతీతంగా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాదన్నారు.

పలివెల నుండి ఊకొండి వెళ్లే రహదారిని, పలివెల నుండి చీకటిమామిడి వెళ్లే రహదారిని పరిశీలించారు. గ్రామంలో వున్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో  చదువుల నాణ్యత పెంచాలని  ప్రభుత్వ ఉపాధ్యాయులకు సూచించారు.ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫర్నిచర్ లైట్లు ఫ్యాన్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా  ఫర్నిచర్ ఇప్పించే బాధ్యత నాదని,  సామాజిక బాధ్యతతో లైట్లు ఫ్యాన్లు మీరే ఇప్పించాలని హితవు పలికారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ప్రోత్సహించి మెమెంటోలు అందజేస్థామని తద్వారా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలనుకుంటే అవ్వదని ఈ గ్రామం నుండి బయటికి వెళ్లి అభివృద్ధి చెందిన వ్యక్తులు తమ సామాజిక బాధ్యతగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. పలివెల గ్రామంలో డ్రైనేజీ సిస్టంను శాస్త్రీయంగా నిర్మించాల్సిన అవసరం ఉందని దానికోసం ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గృహాలపైన ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించి, గృహాల మధ్యలో రక్షణ కవచం లేకుండా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను షిఫ్ట్ చేయాలని విద్యుత్ అధికారులను  కోరారు.

గ్రామంలో కొత్తగా ఎంతమంది అర్హులకు పింఛన్లు రావాలి, ఎంతమంది ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్నారు, వీరిలో వృద్ధాప్య పింఛన్లు ఎన్ని, వితంతు పింఛన్లు, గీత కార్మిక పింఛన్లు, చేనేత కార్మిక పింఛన్లు, ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి జాబితాను సిద్ధం చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జీవనపల్లి సైదులు, గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీవో, విద్యుత్ ఏఈలు ఉన్నారు.