31-12-2025 09:30:18 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ రూరల్ మండల పరిధిలోని హనుమాజీపేట గ్రామంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించి, లభ్యమైన పాదముద్రలను పరిశీలించారు.
అవి చిరుత పులి అడుగులేనని అధికారులు అధికారికంగా ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని రుద్రంగి, మరిమడ్ల, వట్టిమల్ల గ్రామాల్లో తిరిగిన చిరుత, ఇప్పుడు హనుమాజీపేట పరిసరాల్లోకి రావడంతో ప్రజలు వణికిపోతున్నారు.పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.