నూతన ఉత్సాహంతో సరికొత్త లక్ష్యాల దిశగా అడుగులు వేద్దాం
- నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పునరంకితం అవుతాం
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం, మార్చి 19, (విజయక్రాంతి): ప్రభావనామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సరికొత్త ప్రభావాన్ని చూపిస్తూ, అందరి ఇళ్లు వెలుగులతో నిండాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శ్రీ ప్రభావనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం ఆయన నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాలను సందర్శించి, ప్రజలతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసంత కాలం రాకతో ప్రకృతి ఎలాగైతే కొత్త చిగురు తొడుగుతుందో, ఈ నూతన సంవత్సరం కూడా ప్రజలందరి జీవితాల్లో సరికొత్త ఆశలను, ఆశయాలను చిగురింపజేయాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మనకు జీవితంలోని సుఖదుఃఖాలను, లాభనష్టాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, పచ్చని పంటలతో అన్నదాతల ఇళ్లు కళకళలాడాలని, రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉండాలని. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా, సామాజిక ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగడమే మన ప్రధాన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, అందరి ఇళ్లలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నిండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఆలయకమిటీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.




