07-01-2026 12:20:47 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జనవరి 6 (విజయక్రాంతి): నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబ ర్లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్మల్ ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందామని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవాల వేదిక ద్వారా ప్రజలకు పరిచయం చేయగలిగామన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయాలని, సుందరీకరణ పనులు చేపట్టి మరుగుదొడ్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించాలని నిర్మల్ ఉత్సవాల విజయవంతానికి విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఈఓ భోజన్న, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, డీపీఆర్వో విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఈడీఎం నదీమ్ పాల్గొన్నారు.
సమగ్ర ఓటర్ల జాబితాలు రూపొందిస్తాం
మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై ఉన్న అభ్యంతరాలను నిర్ణీత గడువు లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ వేరు వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియపై వివరించారు.
ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, లోపాలు లేకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీ వరకు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు లేదా జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.