07-11-2025 07:22:07 PM
బతుకుదెరువు కోల్పోయిన రైతు కుమార్
గుమ్మడిదల: పాడి పశువులను పెంపొందిస్తూ జీవనం గడుపుతున్న రైతులకు వీధి కుక్కల దాడితో జీవనం లేకుండా పోతుంది. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో కుక్కల దాడిలో పాడి పశువులు మృత్యువాత పడ్డ సంఘటన మంబాపూర్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. మంబాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన రైతు సంఘం కుమార్ పొలంలో ఒక ఆవు, రెండు లేగ దూడలపై గురువారం రాత్రి వీధి కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత చెందాయి. పాడి పశువులతో జీవనం కొనసాగిస్తున్నకుమార్ కు పశువులు చనిపోవడంతో సుమారు లక్షన్నర రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. వీధి కుక్కల నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వ అధికారులు బాధిత రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఎం.దశరథ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. బాధితునికి న్యాయం చేస్తామని కమిషనర్ దశరథ్ కుమార్ హామీనిచ్చారు.