03-11-2025 12:00:00 AM
							గణవేషణలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ లో ఆది వారం చేపట్టిన పథ సంచాలన్ ఘనంగా జరిగింది. ఆదివారం స్థానిక మల్టీపర్పస్ గ్రౌండ్ లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహసేవ ప్రము ఖ బలవత్రి గణేష్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇందూర్ విభాగ సంఘ్ చలక్ నిమ్మల ప్రతాప్ రెడ్డి, నగర్ సంఘ్ చలక్ డాక్టర్ కళ్యాణ్ రెడ్డి తో పాటు వేలాదిగా స్వయం సేవకులు పాల్గొన్నారు.
ముందుగా భరతమాత, డాక్టర్ బలిరామ్ కేశవ్ హెడ్గేవార్, మాధవ్ రావ్ సదాశివ రావ్ గోల్వల్కర్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసి, కాషాయపు పతాకాన్ని ఎగరవేసి, ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు.అనంతరం స్వయం సేవకులు రెండు విభాగాలుగా విభజించబడి గ్రౌండ్ నుండి పట్టణ పురవీధుల గుండా పథ సంచాలన్ చేపట్టారు.
ఈ సందర్భంగా దారి పొడవున్న ప్రజలు స్వయం సేవకులకు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ, వారిపై పూల వర్షాన్ని కురిపించారు. అటు పథ సంచాలన్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పథ సంచాలన్ జరిగే రూట్ మ్యాప్ గుండా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్త లేకుండా ఏర్పాటు చేపట్టారు.