ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకరు మృతి
ఏడుపాయల చెక్ డ్యాం సమీపంలో ఘటన
పాపన్నపేట: ఏడుపాయల ఆలయం ప్రాంగణంలో ఉన్న చెక్ డ్యాం సమీపంలో ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని నవాబ్ పేట గ్రామానికి చెందిన కంకరి నాగరాజు(31)కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంది. ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం ఏడుపాయలకు వచ్చాడు. చెక్ డ్యాం సమీపంలో స్నానం చేయడానికి నీటిలోకి దిగాడు.
నీటిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. కాసేపటికి అటుగా వెళ్లిన స్థానికులు ఒడ్డుపై ఉన్న చెప్పులు, బట్టలు, ఫోన్ ను గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తండ్రి మానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.






