16-12-2025 02:21:43 PM
హైదరాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిర్పూర్(యు) మండలం పెద్దదోబలో మావోయిస్టుల ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన 16 మంది మావోయిస్టులను ఛతీస్ గఢ్ వాసులుగా గుర్తించి వారి నుంచి ఏకే 47, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో తొమ్మిది మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నట్లు ఏఎస్పీ చిత్తరంజన్ వెల్లడించారు. ఇందులో జిల్లా కమాండెంట్ సభ్యుల స్థాయి కేడర్ లో నలుగురు ఉన్నట్లు సమాచారం. ఛతీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మావోయిస్టులు వారి స్థావరాలను మారుస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను హైదరాబాద్ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.