పంచాయతీ అనుమతులు లేకుండా భారీ నిర్మాణం
వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, పైగా పంచాయతీ సీసీ రోడ్డుపైనే కాంపౌండ్ వాల్ నిర్మించడం వంటి చర్యలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రామంలో భారీగా నిర్మించిన బంగ్లా కేవలం అనుమతుల్లేకుండా మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ప్రజల సౌకర్యాలను కూడా పట్టించుకోకుండా నిర్మించబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరెంటు వైర్లకు కూడా అంతరాయం కలిగేలా నిర్మాణం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ముఖ్యంగా, స్థానికుడు రఘువీర్ పంతులు కి చెందిన సుమారు 30 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై గ్రామపంచాయతీ అధికారులు ఐదుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడం గమనార్హం. దీంతో బాధితుడు మళ్లీ ఫిర్యాదు చేయడంతో డీఎల్పీవో యాదయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నడిరోడ్డులో ఇల్లు నిర్మించడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ప్రజల సౌకర్యాలు, భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన ఇంటి యజమాని ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో శాంతి, క్రమశిక్షణ కొనసాగాలంటే ఇలాంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం అవసరం.అని గ్రామస్తులు హెచ్చరించారు.






