ఇందిరాపురంలో భారీ అగ్నిప్రమాదం
ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh State) రాష్ట్రం ఘజియాబాద్లోని ఇందిరాపురం, అభయ్ ఖండ్ ప్రాంతంలో ఉన్న గౌర్ గ్రీన్ అవెన్యూ సొసైటీలోని ఒక నివాస ఫ్లాట్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో నివాసితుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీలోని ఒక ఫ్లాట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ భవనం నుండి దట్టమైన పొగ వెలువడుతున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి పలు అగ్నిమాపక వాహనాలను మోహరించారు. అగ్నిమాపక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జనసాంద్రత కలిగిన ఇందిరాపురం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అత్యవసర బృందాలు కృషి చేస్తుండగా స్థానికులలో ఆందోళనలు నెలకొన్నాయి.. ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






