12-12-2024 01:18:15 AM
* హ్యాండ్లూమ్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని చేనేత కార్మికుల అభ్యున్నతికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు హ్యాండ్లూమ్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామ య్యర్ పేర్కొన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్ను ఆమె బుధవారం ప్రారంభించి మాట్లాడారు. చేనేత కార్మికులకు పొదుపు, బీమాతో పాటు వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మార్కె టింగ్ పరంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఒకేచోట ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో 80 స్టాల్స్ ఏర్పాటు చేశామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్కుమార్ తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి, ఫెస్టివల్స్ను దృష్టిలో పెట్టుకుని పోచంపల్లి, మదనపల్లి, గద్వాల, వెంకటగిరి, చెందేరి, ఇక్కత్, నారాయణపేట, బెనారస్, కొలకత్తాతో పలు నగరాలకు చెందిన విభిన్నమైన నూతన డిజైన్లతో స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ వస్త్ర ప్రదర్శన 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ్కుమార్, శ్రీదేవి, శైలజ తదితరులు పాల్గొన్నారు.