04-06-2025 12:49:28 AM
విజయక్రాంతి,ములుగు ప్రతినిధి: వచ్చే సంవత్సరం (2026)లో జరగనున్న మేడారం మహాజాతను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
జిల్లా అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాబోతున్నందున ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కొరకు ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క రానున్న మేడారం మహా జాతరను, భారీ వర్షాలు పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి శబరిష్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, డిఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో జరిగిన మహా మేడారం జాతర సందర్భంగా పనిచేసిన జిల్లా అధికారులు నేటికీ జిల్లా అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 33 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రానున్న రోజులలో జాతరలో శ్వాశత పనులను నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. ముఖ్యంగా జాతర సమయంలో మేడారంలోని పరిసరాలు అపరిశుభ్రంగా మారకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేయాలని తెలిపారు.
జిల్లా పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, భక్తులు సులభతరంగా దర్శనాలు ముగించుకునే విధంగా క్యూ లైన్ లు, వాటి పై షేడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రం నుండి ఏటూరునాగారం వరకు గల జాతీయ రహదారి ఇరువైపుల గల చెట్లను అటవీ శాఖ, ఆర్ అండ్ బి సిబ్బంది పర్యవేక్షించాలని, అందులో బలహీనమైన చెట్లను గుర్తించి వాటిని తొలగించాలని సూచించారు. జిల్లాలోని లోతట్టు గ్రామాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వర్షాల కారణంగా ఏర్పడే వరద ప్రభావంతో రహదారులు దెబ్బతినకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, పూరిత పరిస్థితులలో ప్రజలకు త్రాగునీరు, ఆహారం పంపిణీపై దృష్టి సారించాలని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని, లైవ్ జాకెట్స్, చిన్న పడవలు, తాళ్లు, కటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని కటాఫ్ గ్రామాలను గుర్తించి ప్రజలను అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
లోతట్టు ప్రాంతాలను గుర్తించి వరద ప్రవాహాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజల రక్షణ దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని, అన్ని శాఖల అధికారులతో గ్రూపు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తప్పుడు సమాచారాలు ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ భరోసా ఇవ్వాలని తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సేవలు అందించాలని, ఓ ఆర్ ఎస్, యాంటీబయోటిక్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా విధులలో బదిలీల ప్రణాళిక తయారుచేసి అందించాలని తెలిపారు. భారీ వర్షాలను, మేడారం మహా జాతర జిల్లా యంత్రాంగం సవాల్ గా స్వీకరించి అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి రవీందర్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, మండల అధికారులు, మేడారం పూజారులు, తదితరులు పాల్గొన్నారు.