19-07-2025 12:00:00 AM
ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి
రేవల్లి జులై -18 : మండల పరిధిలోని గౌరిదేవి పళ్లి గ్రామంలో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్ - 3 రిజర్వాయర్ గేట్లను శుక్రవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి, స్థానిక ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, డి సిసిబి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి లతో కలిసి ప్రారంభించి హెడ్ రెగ్యూ రేటరీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కృష్ణా జలాలకు పుష్పమాలలు, గులాబీలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రేవల్లి, అనంతపురం, ఏదుల, తీగలపల్లి రోడ్డును ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణంతో నాగర్ కర్నూల్, వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు రవాణా సౌ కర్యం సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ నిర్మించే ఈ రహదారి గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వీలైనంత త్వరగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీశీలా రెడ్డి, పర్వతాలు, దాసు బాలస్వామి, సుబ్బారెడ్డి, రవీందర్ రెడ్డి,స్వామి, తోకల బాల్రెడ్డి గుర్నాథ్ రెడ్డి, తెప్ప మహేశ్వరం తదితరులు పాల్గొన్నారు.