01-11-2025 02:17:13 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kasibugga Venkateswara Temple ) శనివారం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించారు. తొక్కిలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ(Minister Anam Ramanarayana) రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఆనం ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ... శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదని పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు. హరిముకుంద్పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం అన్నారు. ఈ దేవాలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉందన్న మంత్రి ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు రావడం జరిగిందన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కానీ సదరు వ్యక్తి చేయలేదని తెలిపారు. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణమని సూచించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు.