calender_icon.png 16 November, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి క్రీడా పాఠశాలల ఏర్పాటు

16-11-2025 07:46:54 PM

రాష్ట్ర మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి..

హన్మకొండలోని జే ఎన్ ఎస్ లో స్పోర్ట్స్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి..

హన్మకొండ (విజయక్రాంతి): విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా పాఠశాలను ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ను వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,  రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, సాట్స్ ఎం.డి సోనీ బాలా దేవి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, కార్పొరేషన్ చైర్మన్లు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మెట్టు సాయి కుమార్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడా పాఠశాలలో క్రీడ పరికరాలతో పాటు, అక్కడ కల్పించిన  సదుపాయాలను మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. టోక్యోలో డెఫ్ లింపిక్స్ 2025 లో షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్ కు స్పోర్ట్స్ పాలసిలో భాగంగా రూ.కోటి 20 లక్షల నజరానా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో స్పోర్ట్స్ పాఠశాలలు ఉన్నాయని, ఇందులో హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ తర్వాత నాలుగో క్రీడా పాఠశాలను హనుమకొండలో ఈరోజు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 132 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో శాశ్వతంగా క్రీడా పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో క్రీడలకు ఇతోధిక ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణ అత్యవసరమని, ఎన్నుకున్న క్రీడల మీదే శ్వాస, ధ్యాస ఉండాలని అప్పుడే విద్యార్థులు క్రీడల్లో ఉన్నతంగా రాణించ గలుగుతారని, ప్రపంచం మొత్తం ఇటు వైపు చూడాలంటే విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, క్రీడల పై పూర్తి స్తాయిలో దృష్టి సారించకపోతే క్రీడల్లో రాణించలేరని అన్నారు. విస్తీర్ణంలో తెలంగాణ  రాష్ట్రం కంటే  చిన్న దేశమైన దక్షిణ కొరియా ఇటీవల జరిగిన ఒలంపిక్స్ లో 36 స్వర్ణ పథకాలు సాధించాయని,  మనం ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించలేదని మనం ఎందుకు పతకాలు సాధించలేక పోతున్నామో విద్యార్థులు ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా కేవలం క్రీడల పైనే ఆసక్తి కనబరచాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పెంచే యోచన చేస్తామని తెలిపారు. క్రీడల్లో పైరవీలకు ఆస్కారం లేదని స్పష్టం చేసిన మంత్రి ,స్పోర్ట్స్ అథారిటీ లీగ్ తెలంగాణ  2025-26 విద్యా సంవత్సరం కోసం 80 మంది బాల బాలికలతో హన్మకొండ లో స్పోర్ట్స్ స్కూల్ ను ప్రారంభిoచడానికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని, దీంతో గ్రామీణ స్థాయి క్రీడాకారులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.

చిన్న వయసు నుంచే ప్రతిభావంతులను గుర్తించి వారికి శిక్షణ,పోషణ, శారీరకంగా దృఢంగా ఉండేలా తీర్చిదిద్దడం జరుగుతుందని, క్రీడా పాలసీ ద్వారా ప్రతి జిల్లాలో ఆధునిక స్టేడియాలను, శిక్షణా కేంద్రాలు, క్రీడా పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా క్రీడారంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని స్పష్టం చేసిన మంత్రి, తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ హబ్ ఆఫ్ ఇండియా గా ఎదగడమే స్పోర్ట్స్ పాలసీ ప్రధాన లక్ష్యమని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తుందని ఈ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో విద్యను అందించడం జరుగుతుందని ,గురు వందనం కింద తెలంగాణ క్రీడా విభాగం కోచ్ ల కోసం మొదటిసారిగా ప్రత్యేక సంక్షేమ పథకం ప్రారంభించిందని, ఈ పథకం ద్వారా కోచ్ లకు రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని, ఇందులో ఆసుపత్రి చికిత్స, పరీక్షలు, మందులు,చికిత్స తర్వాత అవసరమైన సేవలు ఉంటాయని తెలియజేశారు.

రాష్ట్రంలోని అన్ని స్టేడియాల్లో వేసవి శిక్షణ శిబిరాలు, శిక్షణ కార్యక్రమాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటిసారిగా షేపింగ్ యంగ్ ఇండియా- 2025 పేరుతో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించామని తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించడం కోసం  సీఎం కప్- 2024 ను నిర్వహించామని, మొదటిసారిగా పారా గేమ్స్ ను కూడా ఈ టోర్నమెంట్లో చేర్చడం జరిగిందని మంత్రి తెలియజేసిన మంత్రి విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, కిట్ లను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, సాట్స్ వైస్ చైర్మెన్, ఎం డి సోనీ బాలాదేవి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జీ డబ్ల్యూ ఎం సి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మామిండ్ల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డి వై ఎస్ ఓ. అశోక్ కుమార్, క్రీడా సంఘాల ప్రతినిధులు అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.