04-10-2025 09:50:10 PM
అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలి..
రంగారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక భేటీ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేయడమే లక్ష్యంగా పనిచేయాలి..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు..
రంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిలతో మంత్రి శ్రీధర్ బాబు కీలక భేటీ అయ్యారు. శనివారం జరిగిన ఈ సమావేశంలో రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం), టి. రామ్మోహన్ రెడ్డి(పరిగి), కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), కె.శంకరయ్య(షాద్ నగర్), బి. మనోహర్ రెడ్డి(తాండూర్), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలు కేఎల్ఆర్(మహేశ్వరం), భీం భరత్(చేవెళ్ల) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలం, బలహీనతలు, గత ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి మండలంలో పోటీ చేసే ముగ్గురు జడ్పిటిసి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించి ఈనెల 5 వరకు వారి వివరాలతో నివేదించాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, అయితే.. తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందని స్పష్టం చేశారు.