06-02-2026 05:29:04 PM
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
తాండూరు,(విజయ క్రాంతి): రోటి, కపడ అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని,పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి మాట్లాడారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డు కూడా అందించలేదని దీంతో పేద ప్రజలు ఆకలితో అలమటించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం అందిస్తూ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించామని ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి మంజూరు చేశామని పేదలు కలలుగన్న సొంతింటి కలను తమ ప్రభుత్వం నిజం చేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే రూ.550 కోట్లతో పట్టణ అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... గత రెండేళ్ల కాలంలో తాండూర్ పట్టణ అభివృద్ధి కోసం కేంద్ర మరియు రాష్ట్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కు వెళ్లి పట్టణ అభివృద్ధి కోసం ధైర్యంగా నిధులు కావాలని అడుగుదామని అన్నారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు., నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.