త్వరలోనే ధాన్యం బోనస్ డబ్బులు: మంత్రి ఉత్తమ్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని చెక్ డ్యాములు
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో(Nizamabad Rythu Mahotsav) రైతు మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావులు కలసి సోమవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు రైతు మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం బోనస్ డబ్బులు పెండింగ్ ఉంటే త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ కు ప్రకటించిన పసుపుబోర్డు ఏమైందో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(BJP MP Dharmapuri Arvind) చెప్పాలని మంత్రి ఉత్తమ్ కోరారు.ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగం ఉండేదని ఆయన వెల్లడించారు.
గత ప్రభుత్వం సాగునీటిశాఖపై రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. అదనంగా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని ఉత్తమ్ ఆరోపించారు. నిజాంసాగర్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని చెక్ డ్యాములు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రైతుపక్షపాతిగా ఈ ప్రభుత్వం సాకుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి రూ. లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారు. బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.






