11-02-2026 11:48:01 AM
- మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీలోని 227వ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందిస్తుందన్నారు. ఎక్కడా పోలీసు ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులను ఉపయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని హరించి, ఎన్నికలు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయించిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.