12-11-2025 06:18:25 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా కవులకు కళాకారులకు, కళలకు, సంస్కృతికి పుట్టినిల్లు అని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకుసాగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలు-2025 కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనేక మంది కవులు, కళాకారులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని, యువత తమ ప్రతిభను మరింత పదును పెట్టుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని పేర్కొన్నారు.
చదువుతో పాటు విద్యార్థులు కళలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తమ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇలాంటి "సామాజిక కార్యక్రమాలను, ప్రతిభను వెలికితీసే ఇలాంటి వేదికలను, సామాజిక బాధ్యతగా భావించి సేవాభావంతో ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అధికారులు, యువజన శాఖ ప్రతినిధులు, కళల విభాగ గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు.