అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే
కుమ్రం భీం అసిఫాబాద్, మార్చి 18 (విజయ క్రాంతి) : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు, నిధుల కొరత, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గళం విప్పారు. నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిలు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గతంలో ఎస్టీ సబ్ప్లాన్ కింద నిధులు వచ్చేవని, ప్రస్తుతం మాత్రం నిధుల కేటాయింపు లేక పనులు నిలిచిపోయాయని విమర్శించారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులకు ముందుకు రావడం లేదన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మంగి, గుండాల, మోడీగూడ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరుకోవడం కష్టంగా మారిందని చెప్పారు. ఆదిలాబాద్ ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయని, డబుల్ రోడ్ నిర్మాణం అత్యవసరమని డిమాండ్ చేశారు.
గుండిఅనార్పల్లి బ్రిడ్జి సహా పలు బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షాకాలంలో ప్రజలు ప్రమాదంలో పడుతున్నా రని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, బోర్లు వేయడానికి కూడా నిధులు లేవన్నారు. అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేలకు సీడీపీ నిధులు కేటాయించాలని కోరారు. అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించినా అమలు లేకపోతే ఎలా? కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల ప్రజల కష్టాలను ఎవరు తీర్చాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్యే స్పందించారు.




