03-06-2025 04:33:09 PM
ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం రెవెన్యూ సదస్సు..
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించిన ఎమ్మెల్యే వినోద్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) అన్నారు. తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలోనీ పెగడపల్లి గ్రామంలో మంగళవారం నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి నూతన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను 20 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో బాగానే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారన్నారు. చిరకాలంగా నిలువ నీడలేని ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లతో వారి కళ్ళల్లో ఆనందాన్ని కల్పించుదన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా రెవెన్యూ శాఖ కీలక భూమిక నిర్వహిస్తుందన్నారు. రైతుల భూ సమస్యలను తీర్చడానికి తీసుకొచ్చిన గొప్ప చట్టం భూభారతి అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనలో భాగంగా రైతుల కోసం గ్రామాలకు రెవెన్యూ అధికారులు తరలి వచ్చారన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్, వద్ద సదుపాయాలను పరిశీలించి, రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి తీసుకొచ్చామని పేర్కొన్నారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతి ని తీసుకొని వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరి కృష్ణ, ఎమ్మార్వో జోష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.