calender_icon.png 5 June, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం

03-06-2025 04:41:25 PM

వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఏ. జానయ్య..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రానున్న రెండు, మూడేళ్ళలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ.జానయ్య(Professor A. Janaiah) తెలిపారు. ఇందుకుగాను 430 మంది వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలను రూపొందించి వాటిని రాష్ట్రంలోని 11 వేల రెవెన్యూ గ్రామాలలోని 40 వేల మంది రైతులకు ఫౌండేషన్  విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

"నాణ్యమైన విత్తనం-రైతు నేస్తం" పేరున వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఫౌండేషన్ సీడ్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా 300 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంగళవారం నుండి రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల ద్వారా రెవెన్యూ గ్రామానికి ముగ్గురు లేదా నలుగురు రైతుల చొప్పున ఈ ఫౌండేషన్ సీడ్ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తనాలను ఎంపిక చేసిన రైతులు ఈ సంవత్సరం వాటిని వినియోగించి మంచి పంటలు పండిస్తే వచ్చే సీజన్ కు వారు ఆ విత్తనాన్ని వినియోగించుకోవడంతో పాటు, ఇతర రైతులకు ఇదే విత్తనాన్ని సరఫరా చేస్తే విత్తనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రానున్న సీజన్లో మంచి పంటలు పండించుకోవచ్చని అన్నారు. “నాణ్యమైన విత్తనం- రైతు నేస్తం” పేరుమీద మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  వీడియో కాన్ఫరెన్స్ కు ఆయన నల్గొండ జిల్లా, తిప్పర్తి రైతు వేదికలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ... నకిలీ విత్తనాల వల్ల రైతులు మోసపోకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విత్తనాలను రూపొందించి వాటిని రైతులకు పంపిణీ చేయడం ద్వారా తిరిగి రైతులు అదే విత్తనాలను ఉపయోగించి నాణ్యమైన పంటలు పండించుకునేందుకు చేపట్టిన విత్తన పంపిణీ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నల్గొండ జిల్లాలో   ఉన్న 564 రెవెన్యూ గ్రామాలలో గ్రామానికి   ముగ్గురు  లేదా నలుగురు చొప్పున రైతులకు ఇన్పుట్ సీడ్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వ్యవసాయ సాగుకు ఆవకాశం ఉందని, అనేకమంది రైతులు వివిధ విత్తనాల కొనుగోలు సందర్భంగా నకిలీ విత్తనాల బారిన పడి మోసపోతున్నారని, అలా కాకుండా  వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఫౌండేషన్ సీడ్ పంపిణీ చేయడం  వల్ల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. 

ఒకే రకమైన విత్తనాన్ని వాడటం వల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉండి నష్టపోయే అవకాశం ఉందని, అందువల్ల రైతులు రిజిస్టర్ సీడ్ నే వాడాలని ,ఒకే విత్తనం కాకుండా వివిధ రకాల విత్తనాలు వాడాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో వరితోపాటు, పత్తి, పప్పు ఎక్కువగా సాగు చేస్తున్నారని, వరికి సంబంధించి విత్తనానికి  ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన రైతులే సరైన వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారని, ఆ విత్తనాలు వాడడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని, నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండొచ్చని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1600 మంది రైతులకు అన్ని రెవెన్యూ గ్రామాలలో ఇన్పుట్ సీడ్ ను అందించనున్నట్లు ఆమె తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి తో కలిసి రైతులకు వరి ఫౌండేషన్ సీడ్ ను పంపిణీ చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి ,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తిప్పర్తి మండల వ్యవసాయ అధికారి సన్నీ రాజ్, తదితరులు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ నిర్మాణంలో ఉన్న ఎమ్మార్సీ భవనం, భవిత కేంద్రం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. భవిత కేంద్రంలో ర్యాంపు, రైలింగ్, టాయిలెట్లు వంటి ముఖ్యమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, హెడ్మాస్టర్లను ఆదేశించారు. కాగా ప్రాథమిక పాఠశాలలో సుమారు 7.8 లక్షల రూపాయల వ్యయంతో ఒక హలు, సిడబ్ల్యూఎస్ టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.