06-01-2026 12:52:11 AM
బెంగళూరు, జనవరి ౫: కర్ణాటకలోని బీదర్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన కర్ణాటక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (కేడీపీ) సమీక్షా సమావేశం రసాభాసకు దారితీసింది. ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధ్యక్షతన ఈ సమావేశంలో నివాస లేఅవుట్ల ఆమోదం, అమలు తీర్మానంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే హుమ్నాబాద్ బీజేపీ ఎమ్మెల్యే సిద్దు పాటిల్ తీర్మానంపై తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరాలను తప్పుబడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ భీమారావు పాటిల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త ఘర్షణకు దారి తీసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఇరుపక్షాలను శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అక్కడే ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసులు కొన్నినిమిషాల పాటు నచ్చజెప్పి వారిద్దరిని శాంతింపజేశారు. అనంతరం యంత్రాంగం అనివార్యంగా సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకునే సమావేశంలో బాధ్యతగల ఇద్దరు ప్రజాప్రతినిధులు తన్నుకోవడంపై ఆ రాష్ట్ర ప్రజానీకం మండిపడుతోంది.