ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు దిశానిర్దేశం
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకీ అత్యంత ప్రతిష్ఠాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పార్టీ గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లతో సీఎం జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజక వర్గంలోని అన్ని పోలింగ్ బూత్లను సందర్శించాలని దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని చెప్పారు. ఇది తీన్మార్ మల్లన్న గెలుపు మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నిక కూడా అని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు






