28-06-2025 05:50:29 PM
వాడవాడల జెండా ఎగురవేసి మాదిగల ఐక్యతను చాటుదాం
ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ
కోదాడ: జూలై ఏడో తారీఖున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ(MRPS South Telangana State President Chinta Babu Madiga) పిలుపునిచ్చారు. శనివారం కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ బాణాల అబ్రహం, పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణకై మాదిగ బిడ్డలు అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు.
వర్గీకరణ కై జరిగిన పోరాటంలో తమ మాదిగ జాతి బిడ్డలు ఎంతోమంది అమరులయ్యారని వారి త్యాగాల ఫలితంగానే నేడు వర్గీకరణ సాధించామని తెలిపారు. వర్గీకరణ అనంతరం మొదటిసారిగా జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన వాడ వాడల పార్టీ దిమ్మెలకు రంగులు వేసి జెండాలు ఆవిష్కరించి పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అసెంబ్లీలో వర్గీకరణ చట్టం అమలు చేసినందుకు మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.