15-12-2025 05:04:42 PM
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్ సిన్హా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నబీన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పార్టీ నేతలు ఆయన శుభాకాంక్షలు వెల్లడించారు. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు నాయకులు పార్టీ కార్యాలయంలో హాజరయ్యారు.
దివంగత బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడైన నబిన్(45) అతిపిన్న వయసులో అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. చురుకైన వ్యక్తి, సైద్ధాంతికంగా బలమైన పునాదులు ఉన్నవాడు, సంస్థ పట్ల తీవ్ర నిబద్ధత కలిగినవాడని పార్టీ నాయకులు తెలిపారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉందని, బీజేపీ అనుబంధ సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబిన్, బీహార్లోని బాంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.