బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం

01-05-2024 12:59:21 AM

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

మేడ్చల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి)/ఎల్బీనగర్: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లను కోరారు. హైదరాబాద్ నాగోల్ డివిజన్‌లో గౌడ సంఘం నాయకులతో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడు తూ.. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పని చేస్తున్న నాయకులనే ఎన్నికోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా తాను కరోనా కష్టసమయంలో చేసిన పనులను చూసి, తనను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

తాను తెలంగాణకు చెందిన వ్యక్తినని, తనను ప్రపంచంలోని తెలుగువారందరూ గుర్తిస్తారని తెలిపారు. దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పేరున్న మల్కాజిగిరి నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తానని చెప్పారు. బీజేపీ మొదటి లక్ష్యం దేశ రక్షణ అని, పదేండ్ల కాలంలో బీజేపీ పాలనా విధానం చూసి, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థలో ఉన్నదని, ఆ పార్టీ 40 సీట్లను మించి గెలవలేదని, ఆ పార్టీకి ఓటేస్తే వృథానే అవుతుందని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

బుడగ జంగాల సమస్యలు పరిష్కరిస్తా 

 బుడగ జంగాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం మల్కాజిగిరి దుర్గాపురం బుడగ జంగాల బస్తీవాసులతో ఈటల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల సర్టిఫికెట్లు, రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరించానని గుర్తుచేశారు. కరోనా కాలంలో తాను చేసిన సేవలను గుర్తుచేసుకుని గెలిపించాలని అభ్యర్థించారు. మిగతా సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.