మరోసారి ఎంపీగా గెలిపించండి

01-05-2024 01:00:27 AM

అడ్డగుట్టలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి పాదయాత్ర

కరపత్రాలు పంచుతూ ఇంటింటి ప్రచారం

రాష్ట్రంలో బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని ధీమా

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సార్వత్రిక ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని, మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. అడ్డగుట్ట ‘ఏ’ సెక్షన్‌లో ప్రారంభమైన ఆయన యాత్ర ‘డీ’ సెక్షన్, వెంకట్‌నగర్ మీదుగా సాయినగర్, పోలీస్‌స్టేషన్ రోడ్‌లో కొనసాగింది. ఈ సందర్భంగా పదేండ్లలో మోదీ ప్రభుత్వ విజయాలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను కిషన్‌రెడ్డి ఇంటింటికీ పంపిణీ చేశారు.

మహిళలు, యువకులు, వృద్ధులను కలిసి మరోసారి సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ లో అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. అంతకు ముందు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. మోదీ నాయకత్వంలో దేశంలో సాగుతున్న పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుత పాలన గురించి న్యాయవాదులకు వివరించారు. న్యాయవాదులు బీజేపీకి మద్దతు ఇవ్వాలని, సికింద్రాబాద్ నుంచి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ బాధ్యులను కిషన్‌రెడ్డి సన్మానించారు.