01-01-2026 12:40:10 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు మారిపోయా యి. 27 మున్సిపాలిటీల విలీనం, నగర పునర్వ్యవస్థీకరణలో భాగంగా 12 జోన్లు, 60 సర్కిళ్ల ఏర్పాటుతో బుధవారం పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన సర్కిళ్లు, జోన్లకు అధికారులను నియమిస్తూ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా జి సృజన, టి వినయ్కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లను వినయ్ కృష్ణారెడ్డి, ఐటీ కారిడార్తో కూడిన కీలకమైన కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల బాధ్యతలను జి. సృజన చూస్తారు.
ఏఎంసీల నియామకం
60 సర్కిళ్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను నియమించారు. శివారు ప్రాంతాల విలీనంతో అక్కడ పాలనను గాడిలో పెట్టేందుకు అనుభవజ్ఞులైన అధికారులకు బాధ్యత లు అప్పగించారు. విస్తరించిన నగరంలో మౌలిక వసతుల కల్పన సవాలుగా మారిన నేపథ్యంలో ఇంజినీరింగ్ విభాగాన్ని రెండు రకాలుగా ఫీల్డ్, హెడ్ ఆఫీస్ విభజించి అధికారులను నియమించారు. పనుల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ప్రతి జోన్కు ఒక జోనల్ ఎస్ఈతో పాటు, సర్కిళ్ల విభజనతో ఇద్దరు ఏఈలను నియమించారు.