22-12-2025 10:54:53 PM
మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ రేకుల గంగా చరణ్
కుభీర్ మండలంలో పలువురు నూతన సర్పంచులకు సత్కారం
కుభీర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల నాయకుడు రేకుల గంగాచరణ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కుభీర్, నిగ్వా, పార్డి కె, పార్డి (బీ), బెల్గాం, ధార్ కుభీర్, పల్సి, సిరిపెల్లి (హెచ్), సోనారి, మలేగాం, చోండి, జాంగాం, గోడ్సేరా, హంపోలి, గోడపూర్, సాంవ్లీతో పాటు పలు గ్రామాల నూతన సర్పంచులను, ఉపసర్పంచులను ఆయన శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
పలు గ్రామాలలో ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం అంటే ప్రజల మనసులను దోచుకోవడమేనని, గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కూడా అంతే కీలకమైనదని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పల్లెలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయని,
నేడు ఆ పల్లెలు అందవికారంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి సర్పంచులు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయా గ్రామాల సర్పంచులు కందూరి సాయినాథ్, మెంచు రమేష్, బందెల గంగామణి సత్యనారాయణ, సతీష్, నరసింహ, షెల్కి లక్ష్మీ ఆనంద్ తో పాటు సాంవ్లీ మాజీ సర్పంచ్ శంకర్, మాజీ వైస్ ఎంపీపీ బీ.శంకర్, ఉప సర్పంచులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.