ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలేవీ
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ ,హెల్త్ అవుట్ సోర్సింగ్ ,కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోంకంటి సుభాష్ డిమాండ్ చేశారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం సరిగా అమలు కావడం లేదని, జీతాలు నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నా, వారికి తగిన గౌరవం, హక్కులు కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, న్యాయమైన నిర్ణయాలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.




