సాగు కోసం నాణ్యమైన విద్యుత్
త్వరితగతిన వ్యవసాయ కనెక్షన్లు
టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాజన్న
మంచిర్యాల, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): పంటలు పండిస్తున్న రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ మంచిర్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్.ఈ.) బి రాజన్న వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా టీజీ ఎన్ పీ డీ సీ ఎల్ పని చేస్తుందన్నారు.
రైతుల కోసం వ్యవసాయ విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూ రు చేసినట్లు తెలిపారు. మంచిర్యాల పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 429 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంటల కోత కాలం ముగియడంతో, రైతుల అవసరాలను దృష్టి లో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన అత్యధిక సంఖ్యలో సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అవసరమైన మెటీరియల్ సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారుల సమన్వయం, సత్వర చర్యల ఫలితంగా సర్వీసుల మంజూరు ప్రక్రియ వేగవంతమైందని ఎస్ఈ వెల్లడించారు.




