calender_icon.png 28 May, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లులు రావు.. మందులు లేవు!

27-05-2025 12:59:18 AM

- ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్యానికి గండం

- గుండె, కాలేయం, కిడ్నీ, న్యూరో, ఆర్థో తదితర మందుల సరఫరా బంద్

- ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, పేట్లబురుజు తదితర హాస్పిటళ్లకు తప్పని ఇబ్బందులు

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి) : ప్రభుత్వ టీచిం గ్ హాస్పిటల్స్‌కు మార్చి నెల నుంచి మందుల సరఫరా నిలిచిపోయింది. సప్లయర్స్‌కు చెల్లించాల్సిన బిల్లులు పెద్దఎత్తున పెండింగ్ పడటంతో వారు హాస్పిటల్స్‌కు మందు ల సరఫరా ఆపేసి తమ నిరసనను తెలుపుతున్నారు.

గత రెండున్నరేళ్లుగా చెల్లింపులు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోనే సరఫరా ఆపేసినట్టుగా సప్లయర్స్ చెప్తున్నా రు. ప్రభుత్వం, సప్లయర్ల సమస్య వారిద్దరికి సంబంధించిన వ్యవహారమైనా ఇక్కడ ఇక్కట్ల పాలవుతున్నది సామా న్యులే. పేదల వైద్యానికి భరోసానిచ్చే ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు, నీలోఫర్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్స్‌కు మందులు, పరికరాల సరఫరా నిలిచిపోయింది.

ఫలితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యానికి మందుల బిల్లుల గండం పట్టుకుంది. బీఆర్‌ఎస్ సర్కారు పెండింగులో పెట్టి పోయిన బిల్లులను కాంగ్రెస్ సర్కారు అదే రీతిన కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడు తోంది. విద్య, వైద్యంపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సిన ప్రభుత్వం ఇక్కడ వైద్యంపై పట్టనట్టు వ్యవహరిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలతో వ్యాపారం నడపడమే కష్టంగా మారడంతో పాటు బ్యాంకుల్లో అప్పులు కూడా చెల్లించే పరిస్థితి లేదని సప్లయర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే తమకు మందుల సరఫరా ఆపడం మినహా గత్యంతరం లేకుండా పోయిందని వారు చెబుతున్నారు. 

సుమారు రూ. 40కోట్ల బిల్లులు పెండింగ్..

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌కు మందులు, పరికరాలను సరఫరా చేసే బాధ్యత తెలంగాణ మెడికల్ సర్వీ సెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) తీసుకుంది. అన్ని సర్కారు హాస్పిటల్స్‌కు కూడా ఈ కార్పొరేషన్ ద్వారానే మందులను సరఫరా చేస్తారు.

అయితే ఇందులో టీజీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేయని మందులు, పరికరాలను 20శాతం మేర సూపర్ స్పెషాలిటీ, టీచింగ్ హాస్పిటల్స్ టెండర్ల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తాయి. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, పేట్లబుర్జు, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్స్‌కు నగరానికి చెందిన ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్‌కు చెందిన 35 మంది సప్లయర్స్ మందులు, పరికరాలు సరఫరా చేస్తారు.

సాధారణంగా మందులు సరఫరా చేసిన తర్వాత 30 రోజుల్లో చెల్లింపులు చేయాలి. కానీ వీరికి 2022 నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. గత ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించుకున్నా బిల్లులు రాలేదు. సుమారు రూ. 40 కోట్ల పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోయాయి. ఇక రాష్ట్రంలోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్ పరిధిలో చూస్తే సుమారు రూ. 100 కోట్లకు పైగానే బిల్లులు పెండింగులో ఉన్నాయని సప్లయర్స్ వాపోతున్నారు.

సీఎం, మంత్రులు, అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ మందుల సప్లు ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌కు మందులు, పరికరాలు అందిచడం లేదని తెలిపారు. ప్రభుత్వం రూపాయి ఖర్చు చేయకుండా పేదలకు ఎలా వైద్యం అందించాలని భావిస్తుందో అర్థం కావడం లేదని పలువురు వైద్యాధికారులు అంటున్నారు. 

సూపర్ వైద్యానికి అడ్డంకులు..

ఉస్మానియా, గాంధీలో అత్యధిక సర్జరీలు జరుగుతాయి. ఇక ఉస్మానియా అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలతో దేశవ్యాప్తంగా ఎంతో పేరుతెచ్చుకుంది. గాంధీలోనూ అనేక అరుదైన శస్త్రచికిత్సలు చేస్తారు. నీలోఫర్‌కు వెళ్తే ఎంతటి క్రిటికల్ కేసులైనా నయమవుతుందని చిన్నారుల వైద్యానికి భరోసానిస్తుందని పేరుంది.

ఇక పేట్లబుర్జు, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్స్ పేద మహిళలకు పురుడు పోసే దేవాలయాలు. పేదల వైద్యానికి ఇంతటి భరోసానిచ్చే ఈ హాస్పిటల్స్‌కు అత్యంత ముఖ్యమైన మందులు సప్లు చేయకుంటే వైద్యులు మాత్రం ఎలా ట్రీట్‌మెంట్ ఇస్తారు. తమ వద్ద ఉన్నంతలో వైద్యం అందిస్తూ రోగులకు సేవలు అందించే పరిస్థితి ఏర్పడింది.

మ ఫార్మసీలో లేని మందులు, పరికరాలను బయటినుంచి తెచ్చుకుంటే తప్ప వైద్యులు కూడా చికిత్స అందించని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే వైద్యంతో పాటు మందులు, పరికరాలు అంతా ఉచితమే అని భావించే పేదలకు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోతోంది.

కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, ఆర్థో, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, యురాలజీ, ఎండోక్రైనాలజీ, పల్మనాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తదితర చికిత్సలకు మందులు, పరికరాల సరఫ రా ఆగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

సీఎంను విన్నవించినా..

గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీనిపై అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి విన్నవించినా బిల్లులు రాలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత అయినా పెండింగులో ఉన్న బిల్లులు చెల్లిస్తారని ఆశించాం. డీఎంఈ, ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.

చివరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినా అదే పరిస్థితి. దీంతో మార్చి నెల నుంచి 5 టీచింగ్ హాస్పిటల్స్‌కు మందులు, పరికరాల సరఫరా ఆపేశాం. వైద్యుల విజ్ఞప్తి మేరకు ప్రాణాపాయంలో ఉండే రోగులకు సంబంధించిన మందులు, పరికరాలు మాత్రం ఆపడం లేదు. నిరుపేదలకు అందించే వైద్యం విషయంలో ప్రభుత్వం స్పందించాలి. వెంటనే మా బిల్లులు చెల్లించి మందుల సరఫరా సవ్యంగా జరిగేలా చూడాలి. 

 రామచంద్ర, అధ్యక్షుడు ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్