ధాన్యం అన్లోడ్లో జాప్యం వద్దు: కలెక్టర్ ఆదర్శ్ సురభి
పెబ్బేరు / శ్రీ రంగాపూర్ జూన్ 9: వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం శ్రీరంగాపురం మండలంలోని లక్ష్మి వారాహి ఇండస్ట్రీ, పెబ్బేరు పరిధిలోని రాధాకృష్ణ ఇండస్ట్రీస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులు, గోదాముల వద్ద వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా అన్లోడ్ చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. లారీల్లో ఉన్న ధాన్యంపై తప్పనిసరిగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు.
మిల్లుల వద్ద లారీలు ఎక్కువసేపు వేచి ఉండకుండా హమాలీల సంఖ్యను పెంచుకోవాలని మిల్లర్లకు సూచించారు. రోజువారీ అన్లోడింగ్ సామర్థ్యాన్ని పెంచి ధాన్యాన్ని త్వరితగతిన దించుకోవాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ కోసం అవసరమైన గోదాములను సిద్ధంగా ఉంచాలని జిల్లా పౌర సరఫరాల అధికారికి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాధ్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






