పదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదు
బీజేపీ ప్రజల మధ్య విద్యేషాలు రెచ్చగొట్టింది
రాజకీయ కక్షతోనే కేజ్రీవాల్ అరెస్టు
కాంగ్రెస్లో మెజార్టీ నాయకులు హిందువులే
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్
హైదరాబాద్, మే ౧౦ (విజయక్రాంతి): ప్రజల మధ్య మత విద్వేశాలు రెచ్చగొట్టడం తప్ప.. పదేళ్లలో మోడీ ప్రభుత్వం చేసిందేమి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో మెజార్టీ నాయకులు హిందూవులేనేని, హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు.
మోదీ ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదు కాబట్టే విద్వేషం పెంచే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంతో బాగుందని, తాను కూడా గర్వపడుతున్నానని చెప్పారు. ప్రజలే అజెండాగా వివిధ అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నేరవేరలేదని, తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ఆయన నిలదీశారు.
బీజేపీ పార్టీ రామ మందిరాన్ని ఎన్నికల కోసం వాడుకోవడాన్ని తాము తప్పుబడుతున్నామని పేర్కొన్నారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నందుకే అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని తెలిపారు. ప్రజలను విడగొట్టడానికి బీజేపీ మీడియాను వాడుకుంటుందన్నారు. రాజకీయ కక్షతోనే కేజ్రీవాల్ను అరెస్టు చేశారని, కేజ్రీవాల్కి బెయిల్ ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషమన్నారు. జాతీయ ఐక్యత చాటడానికే రాహుల్గాంధీ పాదయాత్రలు చేశారని గుర్తు చేశారు.






