11-02-2025 12:00:00 AM
టేకులపల్లి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : టేకులపల్లి మండల కేంద్రంలో ప్రతీ శనివారం నిర్వహించే పశువుల సంత ప్రాంతాన్ని టేకులపల్లి ఎంపీడీఓ రవీందర్ రావు, ఎస్సు సురేష్ లు సోమవారం సందర్శించి పరిశీలించారు. గత శనివారం నిర్వహించిన సంత వద్ద విపరీతమైన రద్దీగా మారి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడటతో “టేకులపల్లి సంత వద్ద రద్దీ..! నిలిచిన రాకపోకలు..!!” అనే కధనం “విజయక్రాంతి”లో ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి పరిశీలించారు.
సంత స్థలం కోదండ రామాలయం పక్కన ఉన్నా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో వ్యాపారాలు ఇల్లందు -కొత్తగూడెం ప్రధాన రహదారికి ఇరువైపులా దుకాణాలు పెట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ విషయాన్ని గుర్తించి వచ్చే శనివారం నుంచి ట్రాఫిక్ కు అంతరాయం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించారు.
రహదారికి దూరంగా దుకాణాలను ఏర్పాటు చేస్తూ సంతకు వచ్చే వారి వాహనాలకు కూడా పార్కింగ్ సదుపాయం కలిపిస్తే ఇబ్బంది ఉండదని గుర్తించారు. దీంతో ఇల్లందు - కొత్తగూడెం ప్రధాన రహదారిలో తిరిగే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీడీఓ, ఎస్సు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.