calender_icon.png 7 May, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకటి కఠినం.. మరొకటి సులువు

17-12-2024 02:15:19 AM

  • ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ పరీక్షలు
  • రెండోరోజు ఉదయం సెషన్‌లో 45.62 శాతం.. మధ్యాహ్నం సెషన్‌లో 45.57 శాతం హాజరు

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): రాష్టవ్యాప్తంగా వందలాది కేంద్రా ల్లో నిర్వహించి గ్రూప్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఆదివారం పేపర్ పేపర్ పరీక్షలు నిర్వహించగా, తర్వాతి రోజు పేపర్ పేపర్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 74.96 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

పేపర్ పరీక్షకు 2,51,738 మంది హాజరు కాగా, 45.62శాతం హాజరు నమోదైంది. అలాగే పేపర్ 2,51,486 మంది హాజ రు కాగా, 45.57 హాజరుశాతం నమోదైంది. రెండో రోజు ప్రశ్నాపత్రాలపై అభ్యర్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల్లో ఆంధ్రా భజన ఉందని, రెండు పేపర్లు కలిపి 13 ప్రశ్నలు ఏపీకి సంబంధించినకావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి అవగాహన ఉంటే తప్ప పేపర్ 3 కష్టమే..

పేపర్ 3 పూర్తిగా ఎకానమీ అని, ఈ పేపర్ కాస్త కష్టంగానే ఉందని ఎక్కువ మంది అభ్యర్థులు వెల్లడించారు. సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఉంటే తప్ప పేపర్ రాసే విధంగా లేదన్నారు. ప్రశ్నాపత్రంలో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌తో పాటు అనేక ఆర్థిక సర్వేలు, జనాభా లెక్కలు, తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, మహాలక్ష్మి పథకం, రెవెన్యూ లోటు, వివిధ జిల్లాల ర్యాంకులు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. 

పేపర్ 4 సులువుగా..

పేపర్ 4లో తొలిదశ, మలి దశ తొలంగాణ ఉద్యమాలు, పలు కమిటీలు, అనేక మంది ఉద్యమకారులు, సంస్థలు, పార్టీలు, ఉద్యమ గేయాలు, విప్లవ సంస్థల ప్రస్థానం, రైతు ఉద్యమాలు, నిజాం పాలన, అనాదిగా తెలంగాణకు జరిగిన అన్యాయాలు, వాగ్గేయకారులు గద్దర్, విమలక్క గేయాలు, ప్రొఫెస ర్ జయశంకర్‌పై ప్రశ్నల సరళి ఉంది. అలాగే ఉమ్మడి ఏపీ సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు వారి పాలనపై ప్రశ్నలు వచ్చాయి.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ, 2009 నాటి కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వంటి వారిపై ప్రశ్నావళి ఉంది. కరీంనగర్‌కు చెందిన మలిదశ ఉద్యమ నేత, మాజీ ఎమ్మె ల్యే వెలిచాల జగపతిరావు, మాజీ మంత్రి జానారెడ్డిపై రెండు ప్రశ్నలు ఉన్నాయి. 55వ ప్రశ్నగా.. ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పడింది? అన్న ప్రశ్నకు వీరద్దరి పేర్లు సమాధానం. కాగా 52ప్రశ్నలో వెలిచాల జగపతిరావుకు చెందిన ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండంటూ మరో ప్రశ్న వచ్చింది. మొత్తానికి ఈ పేపర్ కాస్త సులువుగానే ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు.

సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థి

పటాన్‌చెరు ఏపీజే అబ్దుల్‌కలాం డిగ్రీ  కళాశాలలో సోమవారం గ్రూప్ 2 పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయా డు. తెలిసిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం లక్ష్మీసాగర్‌కు చెందిన నగేశ్ పరీక్షకు హాజరయ్యాడు. ఉదయం పేపర్ 3 బాగానే రాసిన నగేశ్, మధ్యాహ్నం పేపర్ 4 రాస్తూ పరీక్ష హాల్‌లో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్రమత్తమైన ఇన్విజిలేర్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు లు వెంటనే అభ్యర్థిని పటాన్‌చెరులోని ప్రభు త్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

చిన్నారిని ఆడించిన లేడి హోంగార్డ్

రెండు నెలల బిడ్డనెత్తుకుని ఓ తల్లి పరీక్షా కేంద్రానికి వచ్చింది. అప్పటికే బిడ్డ ఏడుస్తుండగా లేడీ హోంగార్డ్ షాహనాజ్ గమనించిం ది. వెంటనే ఆమె బిడ్డను అక్కున చేర్చుకోగా, తల్లి పరీక్ష రాసేందుకు వెళ్లింది. తల్లి పరీక్ష రాసి వచ్చే వరకు లేడీ హోంగార్డు బిడ్డను ఆడించింది. ఈ దృశ్యం సోమవారం వేములవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద కనిపించింది. బిడ్డను ఆడించిన హోంగార్డును పలువురు అభినందించారు.

పరీక్ష రాస్తుండగా గర్భిణికి పురిటినొప్పులు

ఆమె నిండు గర్భిణి. అయినప్పటికీ గ్రూప్ రాయాలనే తపనతో కుటుంబ సభ్యుల సాయంతో  పరీక్షా కేంద్రానికి వచ్చింది. పరీక్ష రాస్తుండగా పురుటినొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన ఇన్విజిలేటర్లు, పోలీసులు ఆమెను ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తెలిసిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామానికి చెందిన సగటోళ్ల రేవతికి ఆరేళ్ల క్రితం వెంకటేశ్‌తో వివాహమైంది.

ఆమె భర్త ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కాన్పులో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండోసారి ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిదో నెల. గర్భం పరీక్ష రాసేందుకు అడ్డుకాదని భావించిన రేవతి ఆదివారం పట్టుదలతో గ్రూప్ పరీక్షా కేంద్రానికి వెళ్లింది. మొదటిరోజు పేపర్ 2 రాసింది. రెండోరోజు సోమవారమూ అదే పట్టుదలతో పరీక్షా కేంద్రానికి వచ్చింది.

ఉదయం పేపర్ రాస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇన్విజిలేటర్ గమనించి పైఅధికారులకు సమాచారమిచ్చారు. ఆమె పరీక్ష రాసి తీరానని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ బదావత్ సంతోశ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ కేంద్రం వద్దకు ఏఎన్‌ఎంతో పాటు ప్రత్యేకంగా అంబులెన్స్ పంపించారు. ఏఎన్‌ఎం ఎప్పటికప్పుడు గర్భిణి ఆరోగ్య పరిస్థితులను గమనించింది.

ఆమె పరీక్ష రాసేందుకు సహకరించింది. అలా ఐదు గంటల పాటు గర్భిణి పట్టుదలతో పరీక్షా కేంద్రంలో ఓపిగ్గా కూర్చొని పరీక్ష రాసింది. తర్వాత గర్భిణిని నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పట్టుబట్టి పరీక్ష రాసిన గర్భిణితో పాటు ఆమెకు వైద్యసాయం అందించిన ఏఎన్‌ఎం కవితను పలువురు అభినందించారు.