calender_icon.png 13 June, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఖాతాలలో రూ.186 కోట్లు జమ

23-05-2025 08:53:17 PM

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 321 కేంద్రాలు ద్వారా 19,824 మంది రైతుల వద్ద నుండి 1,46,134 టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో 186 కోట్ల 12 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. రైతుల వద్ద నుండి పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన 108 కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రోజు 1500 మంది సిబ్బంది, హమాలీలు యజ్ఞంలా పని చేస్తున్నారని, నిత్యం 4 వేల నుండి 8 వేల టన్నుల ధాన్యం కాంటా చేసి 358 లారీల ద్వారా 6 వేల నుండి 8 వేల టన్నుల ధాన్యం కరీంనగర్ లోని 68 మిల్లులకు, పెద్దపల్లిలోని 110 మిల్లులకు, జిల్లాలోని 20 మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. రైతు పండించిన ధాన్యం నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి రోజు దాదాపు 5 కోట్ల రూపాయల నుండి రూ.8 కోట్ల సంబంధిత రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

రైతు ఆటోమెటిక్ యంత్రంతో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాల వద్దకు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలని, అకాల వర్షాల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించుకోవాలని తెలిపారు. ధాన్యం కొలతలు పరీక్షించి గ్రేడ్ ఎ, సాధారణ రకాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, ఓ. ఆర్.ఎస్., గోనె సంచులు, టార్పాలిన్లు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు.