02-06-2025 01:42:00 AM
కరీంనగర్,జూన్1(విజయక్రాంతి):కరీంనగర్ పట్టణంలోని మహిమాన్విత శ్రీ మహాశక్తి దేవాలయ పంచాదశ (15 వ) వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రోజున కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ వార్షికోత్సవ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ భారతి స్వామి వారి కరకమలములచే ఉదయం శ్రీలక్ష్మీ గణపతి, మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు పంచామృతాభిషేకం చేయగా, అర్చకులు స్వస్తి పుణ్య హవచనము, గణపతి పూజ, అఖండ దీపారాధనము, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర సహిత చండీ హోమము, పూర్ణాహుతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలకు హాజరైన సమస్త భక్తులను ఉద్దేశించి జగద్గురువులు విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ, సనాతన ధర్మం ఒక సమగ్రమైన జీవన విధానమని, దీనిలో సత్యం, ధర్మం , సేవ, త్యాగం, ప్రేమ వంటి సద్గుణాలు ఉన్నాయని, ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా , మనం మంచి జీవితాన్ని గడపగలుగుతామని, సమాజానికి ఉపయోగపడతామని విద్యారణ్య భారతి స్వామి అన్నారు.
సనాతన ధర్మమే శాశ్వతమైన ధర్మమన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే మనం ప్రతిరోజు సద్గుణాలను మన జీవితంలోకి తీసుకురావడం లాంటిదన్నారు. మనం సత్యం మాట్లాడాలి, ధర్మం పాటించాలి, సమాజానికి సేవ చేయాలి, త్యాగం చేయాలి, ప్రేమతో ఉండాలన్నారు. సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే అది ఒక శాశ్వతమైన సత్యాన్ని ప్రతిబింబించే ధర్మమన్నారు.
సనాతన ధర్మం అన్ని మతాలు, సాంప్రదాయాల కంటే గొప్పదని పేర్కొన్నారు. సనాతన ధర్మం కేవలం నమ్మకం కాదు ఒక జీవన విధానం అని తెలిపారు. నేటితరం తల్లిదండ్రులను గౌరవించాలని, దేవాలయాలను సందర్శించాలని, సన్మార్గంలో నడవాలని, ధర్మాన్ని రక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ బండ సుమ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.