24-05-2025 08:29:47 AM
రైళ్ల రద్దుతో.. ప్రయాణికుల ఇక్కట్లు
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ రైల్వే స్టేషన్(Mahabubabad Railway Station) వద్ద మూడో లైను మరమ్మత్తు కారణంగా డోర్నకల్ కాజీపేట సెక్షన్లో పలు రైళ్లను రద్దు చేశారు. ముఖ్యంగా డోర్నకల్ నుండి కాజీపేట వరకు ఉదయం పూట ఎగువ దిగువ మార్గాల్లో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే సింగరేణి, గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసి, కేవలం కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు మాత్రమే నడుపుతున్నారు. డోర్నకల్ నుంచి కాజీపేట వరకు మూడు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులంతా ఒక్కగానొక్క కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్లాల్సి వస్తోంది.
దీనితో శనివారం డోర్నకల్ నుంచి కాజీపేట వైపు వెళ్లే కాకతీయ ఎక్స్ ప్రెస్(Kakatiya Express train) రైలు ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. డోర్నకల్ నుంచి కాజీపేట వరకు ఉన్న గార్ల, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, తాళ్ల పూసపల్లి, కేసముద్రం, ఇంటికన్నె, నెక్కొండ, ఏలుగూరు, చింతలపల్లి, రైల్వే స్టేషన్లలో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు నిలుస్తుండడంతో ఉదయం పూట ఈ ఒక్క రైలు మాత్రమే ప్రయాణానికి నడుపుతుండడంతో వందలాది మంది ప్రయాణికులు ఆ రైలు ద్వారా కాజీపేట వైపు ప్రయాణించడానికి విపరీతమైన రద్దీ నెలకొనడంతో తంటాలు పడాల్సి వచ్చింది. భద్రాచలం రోడ్డు నుండి డోర్నకల్ వరకు విపరీతమైన రద్దీతో వచ్చిన కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కడానికి వివిధ స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.