17 March, 2026 | 1:52 AM

కోదాడలో విశ్రాంత ఉద్యోగుల శాంతి ర్యాలీ

17-03-2026 12:36 AM

కోదాడ, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పెన్షనర్ల భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. అక్కడ ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావిళ్ళ సీతారామయ్య మాట్లాడుతూ  యుద్ధం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే కాకుండా, పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం వసుదైక కుటుంబంలా వర్ధిల్లాలని, యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కార్యదర్శి రఘువర ప్రసాద్, హాజీ నాయక్, పెన్షనర్లు పాల్గొన్నారు.