15-09-2025 06:12:28 PM
ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్
అదిలాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ రూ. 6,000 లకు పెంచాలని ఎం.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జి సందే కార్తీక్ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరసనలు వ్యక్తం చేస్తునట్లు తెలిపారు. ఇందులో భాగంగానే విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మావల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సందే కార్తీక్ మాదిగ మాట్లాడుతూ... వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్ రూ.4,000 లకు కండరాల క్షీణత కలిగిన వారికి రూ.15,000 లకు పెన్షన్ పెంచాలన్నారు. పెన్షన్ పెంచడంలో CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. తక్షణమే పింఛన్ పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.