15-09-2025 06:08:50 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరిలో పూజలు చేయనీయడం లేదని పురోహితుడు సోమవారం గోదావరి సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలిపాడు. కాలేశ్వరం గ్రామానికి చెందిన ముమ్మడి రాకేష్ చారి అనే పురహితుడు గత కొన్ని రోజుల నుండి గోదావరి నదిలో అస్తికల నిమజ్జనం (కర్మకాండల) పూజలలో పాల్గొంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆదివారం నాడు బ్రాహ్మణ పురోహిత సంఘం నాయకులు నీవు పురోహితుడి వి కాదని నీవు కర్మకాండ ల పూజలు నిర్వహించ రాదని దూషించినారు.
దీంతో రాకేష్ చారి మనస్థాపం చెంది సోమవారం రోజున రెండు పెట్రోల్ బాటిలతో గోదావరి సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్సై తమాషా రెడ్డి ఆధ్వర్యంలో ఆ యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపారు. దీనిపై రాకేష్ చారి మాట్లాడుతూ బ్రాహ్మణ పురోహిత సంఘం నన్ను అవమానించిందని గోదావరిలో కర్మకాండలు నిర్వహించుకోవడాని కి బ్రాహ్మణ సంఘాని కే హక్కు ఉన్నట్టు మిగతా వారికి లేనట్టు పూజలు చేయనివ్వడం లేదని వాపోయాడు.