1 August, 2026 | 1:53 AM

కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

01-08-2026 01:19 AM

ఖానాపూర్, జూలై 31 (విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం, ప్రస్తుత నీటి నిల్వ, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలకు నీటి విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందించి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాజెక్టు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లు, నీటి ప్రవాహ ప్రాంతాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.