04-06-2025 12:00:00 AM
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట, జూన్ 3 : భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి భరోసానిచ్చారు. మండల కేంద్ర పరిధిలోని ఎదులపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఇట్టి సదస్సులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా భూములను దోచుకునేందుకు తయారు చేసిన చట్టమే ధరణి అని పేర్కొన్నారు, గత ఎన్నికల్లో ధరణి అనే దరిద్రపుగొట్టు చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపి, భూభారతి చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పి, భూ భారతి తీసుకువచ్చామన్నారు.
ధరణి పేరుతో లక్షల కోట్ల విలువ చేసే భూములను బిఆర్ఎస్ నాయకులు కాజేసి, ఆ డబ్బు మదంతో మదమెక్కి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం వంటి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు.
అనంతరం నాణ్యమైన విత్తనం...రైతన్న నేస్తం అనే కార్యక్రమంలో మండలానికి చెందిన ఆదర్శ రైతులకు వ్యవసాయ శాఖ - ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా వృద్ధి చేసిన కంది, జొన్న, వరి విత్తనాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.