13-08-2025 07:13:31 PM
ఎస్సై కె ప్రశాంత్ రెడ్డి..
కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లోని కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో పోలీసులు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై కే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల(డ్రగ్స్) ముప్పుపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, డ్రగ్స్ వాడకంతో కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను వివరించారు. చిన్న వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడటం భవిష్యత్తును చెడగొడుతుందని, అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఎవరైనా డ్రగ్స్ గాని ఇతర మత్తు పదార్థాలకి బానిస అయినట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వారికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది అని ఉపాధ్యాయులకు సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారని లేదా వినియోగిస్తున్నారని గమనించినవారు తక్షణమే డయల్ 100 లేదా 1908 నంబర్కు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. అనంతరం విద్యార్థులచే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా మారి, ఇతరులకు కూడా ఈ అవగాహనను పంచాలని పిలుపునిచ్చారు.